విపక్షాలకు మోడీ స్ట్రాంగ్ కౌంటర్.. ప్రధాని ఎదురు దాడి వెనుక భారీ వ్యూహం..!

by Disha Web Desk 19 |
విపక్షాలకు మోడీ స్ట్రాంగ్ కౌంటర్.. ప్రధాని ఎదురు దాడి వెనుక భారీ వ్యూహం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్షాలపై ప్రారంభమైన మోడీ దండయాత్ర వరుసగా రెండోరోజైన గురువారం కూడా కొనసాగింది. సందర్భానుసారం చమత్కరిస్తూనే చురకలు అంటించిన తీరుతో రాజకీయం అంతా మరోసారి వేడెక్కింది. అయితే విపక్షాల విషయంలో ప్రధాని మోడీ ఎదురు దాడి వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అదానీ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. కానీ ఆ ఒక్క అంశం జోలికి వెళ్లని మోడీ.. మిగతా అన్ని విషయాలపై ప్రతిపక్షాల తీరును తూర్పారబట్టారు. త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌కి ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరగనున్నాయి. మరి కొన్ని నెలల్లో కర్ణాటక ఆ తర్వాత తెలంగాణతో పాటు మరి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్‌లో మోడీ ప్రసంగం బీజేపీ శ్రేణులకు అదుర్స్ అనేలా చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ దెబ్బతో విపక్షాల నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తిని రేపుతోంది.

బుధవారం లోక్ సభలో మాట్లాడిన ప్రధాని 2004 నుంచి 2014 వరకు అవినీతి రాజ్యమేలిందని, కాంగ్రెస్ పాలనలో ఓ దశాబ్దం కాలం దేశం వెనక్కి వెళ్లిందని ఫైర్ అయ్యారు. ఈడీ కారణంగా దేశంలోని విపక్షాలన్ని ఏకం అయ్యాయని, దేశ అభివృద్ధి కోసం విపక్షాలు మంచి ఆలోచనలతో వస్తారని గత 9 ఏళ్లుగా తాను ఎదురు చూస్తున్నాను.. కానీ అలా జరగడం లేదని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలు సరిగ్గా లేవని ఈసీ అధికారులను తిడతారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టును విమర్శిస్తారు. ఇలా తమకు అనుకూలంగా ఏది లేకుంటే దానిపై విమర్శలు చేయడమే విపక్షాలు పనిగా పెట్టున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక దేశంలో అవినీతిని నిర్మూలించామని.. ఈ క్షణం కోసమే దేశం చాలా కాలంగా ఎదురు చూసిందని చెప్పారు. తాను 25 కోట్ల కుటుంబాల వారసుడినంటూ సెంటిమెంట్‌ను రంగరిస్తూ మోడీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక గురువారం రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని కాంగ్రెస్‌పై ఒంటికాలితో లేచారు. ఇందిరా గాంధీ 50 సార్లు ఆర్టికల్ 356ను సంధించారని, హస్తం పార్టీ పాలనలో గవర్నర్ వ్యవస్థను భ్రష్టుపట్టించారని కడిగిపారేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్జీఆర్ ప్రభుత్వాన్ని కూల్చారంటూ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలను అక్రమంగా పదవి నుంచి తప్పించారని ఓ రేంజ్‌లో నిలదీశారు. దేశంలో అనేక సమస్యలకు కాంగ్రెస్ పరిష్కారం చూపలేకపోయిందని, కానీ తాము సామాన్యుల దగ్గరకు పథకాలను తీసుకువెళ్లామన్నారు. ఓ వైపు ప్రతిపక్షాల తీరును దుయ్యబడుతునే తాము చేపిన పనినేంటో చెప్పుకుంటూ మోడీ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలైన లౌకిక తత్వం అంటే ఏంటో మేం చూపించాం. నెహ్రూ ఇంటిపేరు వాడేందుకు గాంధీలు ఎందుకు సిగ్గుపడుతున్నారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

అయితే అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం విపక్షాలు పట్టుబడుతున్నా ఆ అంశాన్ని ప్రస్తావించని ప్రధాని.. తమ ప్రభుత్వం, పార్టీపై వస్తున్న విమర్శలపై మాత్ర ఓ రేంజ్‌లో విరుచుకుపడటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. విపక్షాల నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించిన మోడీ.. బీజేపీయేతర ప్రభుత్వాలపై గవర్నర్లను ప్రయోగిస్తున్నారని, నిరుద్యోగం, లౌకికతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై ఈ సందర్భంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఐక్యంగా ఉంటే తప్పా మోడీని ఎదుర్కోలేమనే సంగతిని ఇప్పటికే గ్రహించిన విపక్షాలు ఆ దిశగా మాత్రం గట్టి ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో విపక్షాల కూటమి వెనుక ఈడీ కోణం ఉందనేది మోడీ దేశ ప్రజల ముందుకు తీసుకురావడం వెనుక బలమైన ప్లాన్ ఉందనే చర్చ జరుగుతోంది. విపక్షాలను చెదరగొట్టడం ద్వారా తమకు మరింత అనుకూలంగా మార్చుకోచ్చని మోడీ భావిస్తున్నారని అందువల్లే.. అదానీ అంశాన్ని ప్రస్తావించకుండా మిగతా అన్ని ఆరోపణలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. మోడీ ఎటాక్ తో విపక్షాల వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది

Next Story

Most Viewed